బుల్లితెర కామెడీ షో `జబర్దస్త్`. దీనికి కొనసాగింపుగా `ఎక్స్ట్రా జబర్దస్త్` షోని కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ షోలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, శాంతి స్వరూప్ వంటి వారు స్కిట్ లు చేస్తూ నవ్విస్తున్నారు. ఈ షోతో వీరంతా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అయితే ఇందులో స్కిట్ లు చేసిన మిగతా వారంతా పోయి కొత్త వారు ఎంటరయ్యారు. ఇమ్మానుయేల్, వర్ష వంటి వారు కొత్తగా వచ్చి చేరడంతో పాత వారికి పనిలేకుండా పోయింది.
దీంతో గతంలో ఈ వేదికపై నవ్వించిన వారంతా తెరమరుగయ్యారు. ఇప్పుడు వారికి నాగబాబు, శేఖర్ మాస్టర్ జడ్జ్లుగా వ్యవహరిస్తున్న `కామెడీ స్టార్స్ ధమాకా` అడ్డాగా మారబోతోంది. `జబర్దస్త్`, `ఎక్స్ట్రా జబర్దస్త్` షోలలో ఆకట్టుకుని హైపర్ ఆది టీమ్ కు అండగా నిలిచిన అభి కొత్తగా `కామెడీ స్టార్స్ ధమాకా` లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన టీమ్ తో కొత్త తరహా స్కిట్ లతో హంగామా చేస్తున్నాడు. ఇతని తరహాలోనే `జబర్దస్త్`, `ఎక్స్ట్రా జబర్దస్త్` షో నుంచి బయటికి వచ్చిన అప్పారావు, రాజమౌళి, జీవన్ `కామెడీ స్టార్స్ ధమాకా` లోకి ఎంట్రీ ఇచ్చేశారు.
వీరందరి రాకతో `కామెడీ స్టార్స్ ధమాకా` ని సరికొత్తగా ప్లాన్ చేసిన మేకర్స్ ఈ నెల 23 నుంచి ప్రత్యేకంగా మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన తాజా ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ షో కు సంబంధించిన మరో విశేషం ఏంటంటే `కామెడీ స్టార్స్` కి యాంకర్ గా వ్యవహరించిన శ్రీముఖి ని పక్కన పెట్టేసి `కామెడీ స్టార్స్ ధమాకా` కోసం దీపిక పిల్లిని రంగంలోకి దించేశారు. దీంతో ఈ షో ఓ రేంజ్ లో `జబర్దస్త్`, `ఎక్స్ట్రా జబర్దస్త్` స్టార్స్ తో హోరెత్తించడం ఖాయంగా కనిపిస్తోంది.